12, ఆగస్టు 2010, గురువారం

భారత రాష్ట్రపతి

సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత దేశానికి దేశాధినేత రాష్ట్రపతి (Rashtrapati / President). రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశాధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయ సభల్ను రాష్ట్రపతి సమావేశపరుస్తారు, ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రిని నియమిస్తారు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే, వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే. ప్రధానమంత్రి సలహా మేరకే, రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైనది.


1956 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత దేశాధినేతగా రాష్ట్రపతి అయ్యారు. అప్పటి వరకు గవర్నర్ జనరల్ దేశాధినేతగా ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, భారత దేశానికి ఇద్దరు గవర్నర్ జనరల్ గా పనిచేసారు.

అర్హతలు:--

భారత రాష్ట్రపతిగా ఎన్నికయేందుకు క్రింద తెలిపిన అర్హతలు ఉండాలి.

భారత పౌరుడై ఉండాలి.
వయసు 35 ఏళ్ళు లేదా ఆ పైబడి ఉండాలి.
లోక్‌సభ సభ్యుడయేందుకు కావలసిన అర్హతలు ఉండాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో గానీ, ఆ ప్రభుత్వాల నియంత్రణలోనున్న సంస్థలలో గాని సంపాదనగల స్థానం కలిగి ఉండకూడదు.
ఒక వ్యక్తి ఎన్నిమార్లైనా రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు. రాష్ట్రపతిగా ఎన్నికవ్వబోయే వ్యక్తి, పార్లమెంటు ఉభయసభల్లోగాని, రాష్ట్ర శాసన సభల్లోగాని సభ్యుడిగా ఉండరాదు. ఒకవేళ అటువంటి సభ్యుడు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే సదరు సభల్లో సభ్యత్వం కోల్పోతారు.

రాష్ట్రపతి వేతనం పార్లమెంటు నిర్ణయిస్తుంది. పదవీకాలం ముగిసే వరకు రాష్ట్రపతి వేతనంలో కోత ఉండదు.


రాష్ట్రపతి ఎన్నిక:--
ప్రధాన వ్యాసము: రాష్ట్రపతి ఎన్నిక


రాష్ట్రపతిని కింది సభ్యులు గల ఎలెక్టోరల్ కాలేజి ఎన్నుకుంటుంది.

పార్లమెంటు రెండు సభలలోను గల ఎన్నికైన సభ్యులు
రాష్ట్ర శాసన సభలలోని ఎన్నికైన సభ్యులు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ఏ కారణం చేతనైనా రాష్ట్రపతి పదవి ఖాళీ అయినపుడు, ఆరు నెలలలోగా కొత్త రాష్ట్రపతి పదవీ స్వీకారం జరగాలి.




రాష్ట్రపతి పదవీకాలం:--

రాష్ట్రపతి ఐదేళ్ళు పదవిలో ఉంటారు. అయితే కింది పద్ధతుల ద్వారా రాష్ట్రపతి పదవీకాలం ముందే/తరువాత ముగియవచ్చు.

రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించినపుడు
రాజ్యాంగంలో సూచించిన విషంగా పార్లమెంటు అభిశంసన తీర్మానం చేసినపుడు
పదవీకాలం ముగిసిన తరువాత కూడా, వారసుడు పదవి చేపట్టే వరకు
తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించిన విషయాన్ని లోక్‌సభ అధ్యక్షునికి తెలియజేసినపుడు



విధులు, అధికారాలు:--

ప్రభుత్వంలోని మూడు వ్యవస్థలకు సంబంధించి, రాష్ట్రపతికి కింది అధికారాలు ఉంటాయి. అయితే ఈ అధికారాలన్నీ అలంకారప్రాయమైనవే. దాదాపుగా అన్ని విధులూ, ప్రధానమంత్రి సలహా మేరకే జరుగుతాయి.


శాసనాధికారాలు:--

రాష్ట్రపతికి శాసన వ్యవస్థకు సంబంధించిన కింది అధికారాలు ఉంటాయి

పార్లమెంటును సమావేశపరుస్తారు, ముగిస్తారు, రద్దు పరిస్తారు
ప్రతి సంవత్సరం ఉభయసభల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగం కూడా, కేంద్ర మంత్రివర్గం ఆమోదించినదే అయి ఉంటుంది
పార్లమెంటు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేసాకే చట్టంగా మారుతాయి. ఏ బిల్లునైనా తిరిగి పరిశీలించవలసిందిగా వెనక్కు పంపవచ్చు. అయితే పార్లమెంటు మళ్ళీ ఆ బిల్లును సంతకం కొరకు పంపినపుడు, రాష్ట్రపతి తప్పనిసరిగా సంతకం చేయవలసి ఉంటుంది.
పార్లమెంటు సమావేశాలు జరగని సమయంలో చట్టాలు చెయ్యవలసి వస్తే, రాష్ట్రపతి సంతకంతో ఆర్డినెన్సు ను జారీ చెయ్యవచ్చు. అయితే తరువాతి సమావేశాల్లో సదరు ఆర్డినెన్సు ను సభ ఆమోదించాలి.


కార్యనిర్వాహక అధికారాలు:--


రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతివే. అవి:

లోక్ సభలో ఆధిక్యత గల పార్టీ/కూటమి నాయకుణ్ణి ప్రధానమంత్రిగా నియమిస్తారు.
భారత రక్షణ వ్యవస్థ సర్వ సైన్యాధ్యక్షుడు అయిన రాష్ట్రపతి యుద్ధ ప్రకటన, సంధి ప్రకటన చేస్తారు.
గవర్నర్లు, ఎన్నికల కమిషనర్లు, న్యాయమూర్తుల వంటి ముఖ్యమైన నియ్తామకాలు చేస్తారు.
విదేశాలలో రాయబారులను నియమిస్తారు. భారత్‌లో నియమితులైన ఇతర దేశాల రాయబారుల పత్రాలను స్వీకరిస్తారు.




న్యాయ వ్యవస్థ అధికారాలు:--

నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదించవచ్చు, శిక్ష తగ్గించవచ్చు
ప్రజా ప్రయోజనకర విషయాల్లో అవసరమనిపిస్తే సుప్రీం కోర్టు అభిప్రాయం తీసుకోవచ్చు. ఆ అభిప్రాయాన్ని పాటించవలసిన అవసరం రాష్ట్రపతికి లేదు.


అభిశంసన విధానం:--

అభిశంసన ప్రతిపాదన పార్లమెంటు లోని ఏదో ఒక సభ ప్రవేశపెట్టాలి. ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీసం 14 రోజుల ముందు సభలోని కనీసం నాలుగోవంతు సభ్యుల మద్దతుతో కూడిన ఒక నోటీసును ఇవ్వాలి.
ఆ తీర్మానాన్ని సదరు సభ రెండింట మూడు వంతుల ఆధిక్యతతో ఆమోదించాలి
ఈ ప్రతిపాదనపై పార్లమెంటు లోని రెండో సభ దర్యాప్తు చేయడం కానీ, లేదా దర్యాప్తు చేయించడం కానీ చేస్తుంది. రాష్ట్రపతికి తన వాదనను వినిపించే అవకాశం ఉంటుంది.
ఈ దర్యాప్తు ముగిసిన తరువాత రెండో సభ కూడా, అభిశంసన ప్రతిపాదనను రెండింట మూడు వంతుల ఆధిక్యతతో ఆమోదిస్తే, అలా ఆమోదించిన తేదీన రాష్ట్రపతిని పదవి నుండి తొలగించినట్లే.



స్వతంత్ర భారత గవర్నర్ జనరల్‌ల జాబితా

సంఖ్య పేరు నుండి వరకు
01 లూయీ మౌంట్‌బాటెన్ ఆగష్టు 15, 1947 జూన్ 21, 1948
02 చక్రవర్తి రాజగోపాలాచారి జూన్ 21, 1948 జనవరి 26, 1950

భారత రాష్ట్రపతుల జాబితా:--

సంఖ్య పేరు నుండి వరకు
01 డా.రాజేంద్ర ప్రసాద్ జనవరి 26, 1950 మే 13, 1962
02 డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ మే 13, 1962 మే 13, 1967
03 డా.జాకీర్ హుస్సేన్ మే 13, 1967 మే 3, 1969
* వరాహగిరి వేంకటగిరి మే 3, 1969 జూలై 20, 1969
* ఎం.హిదయతుల్లా జూలై 20, 1969 ఆగష్టు 24, 1969
04 వరాహగిరి వేంకటగిరి ఆగష్టు 24, 1969 ఆగష్టు 24, 1974
05 ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఆగష్టు 24, 1974 ఫిబ్రవరి 11, 1977
* బి.డి.జట్టి ఫిబ్రవరి 11, 1977 జూలై 25, 1977
06 నీలం సంజీవరెడ్డి జూలై 25, 1977 జూలై 25, 1982
07 జ్ఞాని జైల్ సింగ్ జూలై 25, 1982 జూలై 25, 1987
08 ఆర్.వెంకటరామన్ జూలై 25, 1987 జూలై 25, 1992
09 డా.శంకర దయాళ్ శర్మ జూలై 25, 1992 జూలై 25, 1997
10 కె.ఆర్.నారాయణన్ జూలై 25, 1997 జూలై 25, 2002
11 డా.ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ జూలై 25, 2002 జూలై 25, 2007
12 ప్రతిభా పాటిల్ జూలై 25, 2007 పదవిలో..

* తాత్కాలిక


కొన్ని వాస్తవాలు:--

ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్.
ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతినీ అభిశంసించలేదు.
2007 జూలై 25 న ప్రతిభా పాటిల్ ప్రమాణ స్వీకారం చెయ్యడంతో మొట్టమొదటి సారి ఓ మహిళ రాష్ట్రపతి పదవిని అధిష్టించినట్టయింది.
1969 లో జూలై 20 నుండి ఆగష్టు 24 వరకు భారత దేశానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇద్దరూ లేరు. రాష్ట్రపతి డా.జాకీర్ హుస్సేన్ మే 3 న మరణించగా, ఉపరాష్ట్రపతిగా ఉన్న వి.వి.గిరి తాత్కాలిక బాధ్యతలు చేపట్టాడు. అయితే రాష్ట్రపతిగా పోటీ చేయడానికై జూలై 20న వి.వి.గిరి రాజీనామా చేసాడు. దీనితో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎం.హిదయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసాడు.
1969 లో రాష్ట్రపతి ఎన్నిక, చీలిక దిశగా సాగుతున్న కాంగ్రెసు పార్టీ అంతర్గత రాజకీయాల ఫలితంగా వివాదాస్పదమైంది. కాంగ్రెసు పార్టీ అధికారిక అభ్యర్ధిగా పోటీ చేసిన నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వెయ్యమని ఇందిరా గాంధీ తన పార్టీ వారిని ఆదేశించింది. పార్టీలో తన వ్యతిరేకుల ఆటకట్టించేందుకు ఇందిరా గాంధీ వేసిన ఎత్తు ఇది. ఫలితంగా ప్రతిపక్ష మద్దతు కూడా గల వి.వి.గిరి, సంజీవరెడ్డి ని ఓడించి రాష్ట్రపతి అయ్యాడు. అనంతరం కాంగ్రెసు పార్టీ చీలిపోయింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి