15, ఆగస్టు 2010, ఆదివారం

భారత ఎన్నికల కమిషను

స్వతంత్ర భారత దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ, భారత ఎన్నికల కమిషను. 1950 జనవరి 25 న ఏర్పాటు చేయబడిన ఈ కమిషను సుప్రీం కోర్టు వలెనే, రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు.

కమిషను వ్యవస్థ:--


దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసన సభలు, శాసన మండళ్ళకు జరిగే ఎన్నికలను కమిషను నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణలో పర్యవేక్షణ, మార్గ నిర్దేశకత్వం, నియంత్రణ చేయవలసిన బాధ్యతను రాజ్యాంగం కమిషనుపై ఉంచింది.

ఎన్నికల కమిషను అధినేతను ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటారు. మొదట్లో ఒక కమిషనరు ఉండేవారు. 1989 అక్టోబర్ 16 న మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించారు. అయితే అది కేవలం 1990 జనవరి 1 వరకు మాత్రమే కొనసాగింది. మళ్ళీ 1993 అక్టోబర్ 1న ఈ నియామకాలు జరిగాయి. అప్పటి నుండి ముగ్గురు సభ్యుల కమిషను బాధ్యతలు నిర్వహిస్తూ వస్తూంది.

ముగ్గురు కమిషనర్లతో పాటు ఢిల్లీలో ఉన్న కమిషను కార్యాలయంలో కొంత మంది డిప్యూటీ కమిషనర్లు, 300 మంది ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ [1]రాష్ట్రాల్లో, ప్రధాన ఎన్నికల కమిషనరుచే నియమించబడే ముఖ్య ఎన్నికల అధికారి, కొందరు సహాయక సిబ్బంది ఉంటారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే 50 లక్షల పైచిలుకు సిబ్బంది యావత్తూ తాత్కాలికంగా ఎన్నికలు ముగిసేవరకు కమిషను అదుపాజ్ఞలలో పనిచేస్తారు.

ప్రధాన ఎన్నికల కమిషనరును, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం ఐదేళ్ళు, లేదా ఆ వ్యక్తికి 65 ఏళ్ళ వయసు వచ్చే వరకు -ఏది ముందయితే అది.



కార్య కలాపాలు:--


రాజ్యాంగ సంస్థ అయిన కమిషను ఎన్నికలకు సంబంధించినంత వరకు సర్వ స్వతంత్ర సంస్థ. దీని ముఖ్య కార్యకలాపాలు ఇలా ఉన్నాయి.

రాజకీయ పార్టీలకు గుర్తింపును ఇవ్వడం, రద్దు చేయడం.
ఎన్నికల ప్రణాళికను నిర్ణయించడం, ప్రకటించడం, అమలు చేయడం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం, అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టడం.
స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడం
ఇటీవలి కాలంలో ఎన్నికల నిర్వహణను సంస్కరిస్తూ కమిషను కొన్ని చర్యలు చేపట్టింది. వీటిలో కొన్ని:

ఎలెక్ట్రానిక్ ఓటింగు మిషన్లను ప్రవేశపెట్టడం
రాజకీయాల్లో నేరస్థులను అడ్డుకోవడం
ఓటరు గుర్తింపు పత్రాలను ప్రవేశపెట్టడం
ఓటరు జాబితాల ఎలెక్ట్రానికీకరణ

పదునెక్కిన కమిషను:--


పూర్వపు రోజుల్లో కమిషను కార్యనిర్వాహ వ్యవస్థకు అనుకూలంగా ఉంటూ ఉండేది. ఇటీవలి కాలంలో- ముఖ్యంగా 1990 నుండి - కమిషను మరింత చైతన్యవంతంగా, ప్రభావవంతంగా వ్యవహరిస్తూంది. ఇప్పటికే ఉన్న నియమాలను కఠినంగా అమలు చెయ్యడంతో పాటు, కొన్ని కొత్త నియమాలను కూడా ప్రవేశపెట్టింది. కొన్ని సందర్భాలలో రాజకీయ పార్టీలతో కొందరు కమిషనర్లకు ఘర్షణ నెలకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా, మొత్తం మీద కమిషను పనితీరు మాత్రం ఎంతో మెరుగుపడింది


ప్రధాన ఎన్నికల కమిషనర్లు:--


పేరు పదవీకాలం
సుకుమార్ సేన్ మార్చి 21 1950 నుండి డిసెంబర్ 19 1958
కె.వి.కె.సుందరం డిసెంబర్ 20 1958 నుండి సెప్టెంబర్ 30 1967
ఎస్.పి.సేన్‌వర్మ అక్టోబర్ 1 1967 నుండి సెప్టెంబర్ 30 1972
డా.నాగేంద్ర సింగ్ అక్టోబర్ 1 1972 నుండి ఫిబ్రవరి 6 1973
టి.స్వామినాథన్ ఫిబ్రవరి 7 1973 నుండి జూన్ 17 1977
ఎస్.ఎల్.షక్దర్ జూన్ 18 1977 నుండి జూన్ 17 1982
ఆర్.కె.త్రివేది జూన్ 18 1982 నుండి డిసెంబర్ 31 1985
ఆర్.వి.ఎస్.పేరిశాస్త్రి జనవరి 1 1986 నుండి నవంబర్ 25 1990
వి.ఎస్.రమాదేవి నవంబర్ 26 1990 నుండి డిసెంబర్ 11 1990
టి.ఎన్.శేషన్ డిసెంబర్ 12 1990 నుండి డిసెంబర్ 11 1996
ఎం.ఎస్.గిల్ డిసెంబర్ 12 1996 నుండి జూన్ 13 2001
జె.ఎం.లింగ్డో జూన్ 14 2001 నుండి ఫిబ్రవరి 7 2004
టి.ఎస్.కృష్ణ మూర్తి ఫిబ్రవరి 8 2004 నుండి మే 15 2005
బి.బి.టాండన్ మే 16 2005 నుండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి