15, ఆగస్టు 2010, ఆదివారం

పంచాయితీ

పంచాయితీ గ్రామం స్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీనమైన పాలనా వ్యవస్థ. దీనినే స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థని , భారత దేశంలో పంచాయతీ రాజ్ అని అంటారు. నేపాల్ లో కూడా ఇలాంటి పంచాయితీ వ్యవస్థ నడుస్తుంది.

పంచాయితీ రాజ్ చరిత్ర:--


ప్రాచీనకాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేశేవి. అయితే ఇవి ఎక్కువగా అణచివేతకు గురయ్యేవి. బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరించబడనప్పటికీ గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919 మరియు 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా, 1959 నవంబర్ 1న, ఆంధ్ర ప్రదేశ్ లో దేశంలోనే రెండవదిగా, మహబూబ్ నగర్ జిల్లా షాద్‌నగర్ లో ప్రారంభమైంది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాకు స్ధాయిలో పంచాయతి సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ గా ఏర్పడింది. 1986 లో బ్లాకు స్ధాయి వ్యవస్థని మండల పరిషత్ గా మార్చారు.

73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1994లో నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని చేసింది. [1]ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా వుంది. కేంద్రంలో గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ [2] రాష్ట్రాలలోని అటువంటి మంత్రిత్వ శాఖలతో [3] కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఏప్రిల్ 24 ని పంచాయతిరాజ్ దినంగా పాటిస్తున్నారు.

ఇంచుమించు 30 లక్షల మంది ప్రజా ప్రతినిధులతో నడుస్తున్న పంచాయితీ రాజ్ వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన గ్రామాలకు ఇది వెన్నెముకగా పనిచేస్తుంది. దేశ వ్యాప్తంగా 537 జిల్లా పంచాయితీలు, 6,097 మండల పంచాయితీలు మరియు 2,34,676 గ్రామ పంచాయితీలు పనిచేస్తున్నాయి.

పరిశోధన, శిక్షణ, విద్యాబోధన కోసం కేంద్ర స్థాయిలో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ , రాష్ట్ర పరిధిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అకాడమీ,[4] పనిచేస్తున్నాయి. ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమీషన్ [5] నిర్వహిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి